TELANGANA

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్..

కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించి కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనను నిరసిస్తూ బీజేపీ గాంధీభవన్‌ ముట్టడికి పిలుపునివ్వడం, దానికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ ఆఫీస్ వైపు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు రెండు చోట్లా భారీగా మోహరించారు.

 

మరోవైపు గాంధీభవన్ ముట్టడికి యత్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుల సందర్భంగా బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఒకే రోజు జరిగిన ఈ పోటాపోటీ ఆందోళనలు, అరెస్టులు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేశాయి.