తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దారి ఎటు? గురువారం సాయంత్రం మీడియాతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఆమె ప్రెస్ మీట్ చూసినవాళ్లు మాత్రం, పార్టీ మారడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పలువురు రాజకీయ నేతలు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వెనుక అసలు కారణమేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. చెప్పాల్సిన వన్నీ చెప్పేశారు.. కాంగ్రెస్ పార్టీ కంటే, ఎక్కువగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆయనకు టీడీపీ వాసన పోలేదంటూ ప్రస్తావించారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉండరని చాలామంది నేతలు భావించారు.
ఈ క్రమంలో ఆమె మా వైపు వద్దంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు పోస్టు పెట్టారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంగా కారు పార్టీ నుంచి బయటకు వచ్చేశారని రాసుకొచ్చారు. మీడియా సమావేశం జరుగుతుండగా సురేఖ పక్కన ఆమె భర్త లేరు. మేడ మీద మీసాలు తిప్పుతూ కనిపించారు. అప్పుడే కొండా దంపతులు పార్టీ నుంచి మారడం ఖాయమని డిసైడ్ అయ్యారు.
అయితే, శుక్రవారం మాజీ మంత్రి కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్ బుక్లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’ అని అందులో ఉంది. అంతేకాదు ‘బిగ్ అప్డేట్ ఈజ్ కమింగ్ సూన్’ అంటూ హింట్ ఇచ్చారు. ‘స్టే ట్యూన్డ్ తెలంగాణ’ అంటూ ఆసక్తి పెంచారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ గురించి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ఆసక్తి రేపింది.
కాంగ్రెస్లో కొనసాగుతారా? కీలక నిర్ణయం తీసుకుంటారా? తన రాజకీయ భవిష్యత్పై ఏదైనా ప్రకటన చేయబోతున్నారా? ఇదే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. భర్త కొండా మురళితో కలిసి తదుపరి కార్యాచరణపై ప్రకటన ఉంటుందా? అనే ప్రశ్నలు వెలువడ్డాయి. అయితే, కొండ సురేఖ టీమ్.. ఈ విషయాన్ని కొట్టి పడేసింది. అది ఫేక్ అకౌంట్ అని. ఆ పోస్టుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

