AP

సీఐ నాగరాజు కేసులో మలుపు.. కస్టడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. నిందితుడిని రాజమండ్రి జైలులోనే విచారించాలంటూ గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దర్యాప్తునకు అనుకూలంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

 

విచారణ కోసం సీఐ నాగరాజును విజయవాడలోని దర్యాప్తు కేంద్రానికి గానీ, ఇతర సురక్షిత ప్రాంతాలకు గానీ తీసుకెళ్లి ప్రశ్నించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు అధికారులకు విచారణ ప్రక్రియలో కీలక వెసులుబాటు లభించినట్లయింది.

 

అయితే, కస్టడీ విచారణ సమయంలో నిందితుడిపై ఎలాంటి భౌతిక దాడి లేదా హింసకు పాల్పడరాదని సుప్రీంకోర్టు షరతు విధించింది. అంతేకాకుండా, విచారణ ప్రక్రియ మొత్తాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో సీఐ నాగరాజు కస్టడీ విచారణపై కొనసాగుతున్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.