తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థుల ఉపాధి నైపుణ్యాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.
హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా 1.1 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, వారిలో కొందరు కనీసం ఉద్యోగ దరఖాస్తును కూడా నింపలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఒక తెల్ల కాగితం ఇచ్చి అప్లికేషన్ రాయమంటే రాయలేని పరిస్థితి నెలకొంది. ఇది ‘క్రిమినల్ వేస్ట్’. ఇంజినీరింగ్ చదివామంటూ చిన్న ఉద్యోగాలకు వెళ్లరు, అదే సమయంలో అవసరమైన నైపుణ్యాలను కూడా అలవర్చుకోరు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డిని “చీప్ మినిస్టర్” అని సంబోధిస్తూ, ఆయన విద్యార్హతలను ప్రశ్నించారు. “రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థాయి నుంచి బ్లాక్మెయిలర్గా ఎదిగారు” అంటూ ఘాటు విమర్శలు చేశారు. విద్యార్థులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ముఖ్యమంత్రికి ఉన్న అర్హత ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. తన జీవితంలో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాశారా? లేదా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారా? ఎక్కడైనా ఉద్యోగం చేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తక్షణమే సీఎం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ నేతలు సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది యువతను కించపరచడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల కల్పనతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను విద్యార్థులను విమర్శించలేదని, వారికి సరైన నైపుణ్యాలు అందించడంలో విఫలమవుతున్న విద్యా వ్యవస్థను మాత్రమే ఉద్దేశించానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. విద్యార్థుల్లోని నైపుణ్యాల అంతరాన్ని సరిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని పేర్కొంటూ కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు.

