TELANGANA

హైడ్రా నుంచి రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయండి: హైకోర్టు తాజా ఉత్తర్వులు..

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, ఆయన్ను తక్షణమే ఆ పదవి నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తాజాగా, రంగనాథ్ స్థానంలో మరొక అధికారిని నియమించాలని నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

 

లోతుకుంట భూముల వ్యవహారంలో హైడ్రాకు, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రంగనాథ్ స్పష్టంగా ఉల్లంఘించారని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. వివాదాస్పద స్థలంలోకి యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఇదే కేసులో రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని గతంలోనే హైకోర్టు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

 

ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. టాటా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఉటంకిస్తూ, దేశంలో చట్టబద్ధమైన పాలన మాత్రమే కొనసాగాలని స్పష్టం చేసింది. వ్యక్తుల ఆధిపత్యం పెరగడం ప్రజాస్వామ్యానికి ‘మరణశాసనం’ వంటిదని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది.