వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక ఏఐ-జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై గుంటూరులోని మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఈ కేసు రిజిస్టర్ చేశారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేసినట్టుగా ఉన్న ఒక ఏఐ వీడియోను అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో ద్వారా పెమ్మసాని ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పెమ్మసాని పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

