TELANGANA

ట్రైనీ ఐపీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి సీబీఐ మాజీ డైరెక్టర్..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీ సీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీ.వీ.ఆనంద్‌ కు ఈ మెయిల్‌ పంపారు. ఈ కేసును సీబీ సీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పలు ప్రశ్నలను నాగేశ్వరరావు లేవనెత్తారు. పని చేసే చోట లైంగిక వేధింపులకు చెక్ పెట్టేందుకు తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్‌ మెంట్ (పోష్) చట్టం ప్రకారం అంతర్గత విచారణ పూర్తికాకముందే ఉదయ్ కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అతడిని అరెస్టు చేసే సమయంలో దర్యాప్తునకు సహకరించాడా? సాక్షులను ప్రభావితం చేస్తాడా? పరారయ్యే అవకాశముందా? వంటి అంశాలను పరిశీలించారా? అని నిలదీశారు.

తొలుత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు లేవని పేర్కొన్నారు. కానీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తీవ్ర ఆరోపణలు చేర్చారన్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తుపై తలెత్తిన అనుమానాలకు స్వతంత్ర విచారణతోనే తెరపడుతుందని డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.