కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వేడుకలను జరుపుకోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పరిపాలనా విధానాన్ని, ఆయన పనితీరును ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కుంభకోణాలమయంగా మారిపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. హామీలు నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తుంటే, బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ రాజీనామా చేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదని, ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డేనని తేల్చిచెప్పారు.
విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, జీఓ 97 రద్దు, రైతాంగానికి నమ్మకమైన ఉచిత విద్యుత్ సరఫరా వంటి కీలక ప్రజా సమస్యలే ఎజెండాగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ గళమెత్తుతుందని తెలిపారు. సభలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పూర్తి దిశానిర్దేశం చేస్తారని హరీశ్ రావు స్పష్టం చేశారు.

