ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖలోని తన నివాసంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. ఆయన ఆకస్మిక మృతి వార్త ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆళ్ల నాని వయసు 56 సంవత్సరాలు. 1969లో ఏలూరులోని శనివారపుపేటలో జన్మించారు.
ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీకామ్ పూర్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆళ్ల నాని, 2004లో తొలిసారిగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో కూడా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2017లో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం డిప్యూటీ సీఎంగా.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆయన 2025 ఏప్రిల్ లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆళ్ల నాని మృతి పట్ల ఏపీకి చెందిన రాజకీయ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఏలూరులో ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

