Uncategorized

మిమ్మల్ని థ్రిల్‌ చేసేందుకు వస్తున్నారు: అఖిల్‌

హైదరాబాద్‌: కిరణ్‌ అబ్బవరం థ్రిల్‌ చేసేందుకు వస్తున్నారని హీరో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) అన్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అఖిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ నటులు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి (Kashmira Pardeshi) ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించిన చిత్రమిది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది. దర్శకులు కె. బాబీ, చందు మొండేటి, సుధీర్‌ వర్మ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. వేడుకనుద్దేశించి అఖిల్‌ మాట్లాడుతూ.. ”ఇక్కడికి నేను అతిథిగా వచ్చినట్టు లేదు. ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్‌లాంటిది. గీతా ఆర్ట్స్‌ సంస్థ యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తుంది. అల్లు అరవింద్‌గారి వయసు పెరుగుతున్నా సినిమాపై ప్యాషన్‌, కసి అలానే ఉన్నాయి. కష్టం ఎప్పుడూ వృథాకాదు. కిరణ్‌ విషయంలోనూ అంతే. అతనికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చే ముందు సినిమాలోని రెండు సన్నివేశాలు చూశా. బాగున్నాయి. మిమ్మల్ని థ్రిల్‌ చేసేందుకు వీళ్లు వస్తున్నారు” అని అఖిల్‌ అన్నారు. కథ విన్నప్పుడే భావోద్వేగానికి గురయ్యా: కిరణ్‌ ”నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన తక్కువ సమయంలోనే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటిస్తానని అనుకోలేదు. ఆ నిర్మాణ సంస్థలో వచ్చే చిత్రాలను చూసే నాకు అదే సంస్థలో నటించే అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నాలాంటి ఎంతోమందిని ఆయన సపోర్ట్‌ చేశారు. నటుడిగా ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారని ‘ఎస్‌. ఆర్‌. కల్యాణమండపం’ చిత్రంతో అర్థమైంది. ఆ సినిమా తర్వాత ఎలాంటి కథలో నటించాలి? అని అనుకుంటున్నప్పుడు నందు (డైరెక్టర్‌) అన్న మా ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తూ స్టోరీ వినిపించాడు. నా కళ్లలో నీరు తిరుగాయి. నేనుందుకు భావోద్వేగానికి గురయ్యానో సినిమా చూశాక మీరు అర్థమవుతుంది. ఈ చిత్రంపై నాకు బాగా నమ్మకం ఉంది” అని కిరణ్‌ అబ్బవరం అన్నారు.