రాష్ట్రంలోని ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా సంజీవని కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన ఔషధి సంజీవని అని గుర్తుచేశారు. అందుకే ఆ సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ రోజుల్లో సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే ఆదృష్టవంతులు అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటూ ఉంటారని గుర్తుచేశారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించామని అన్నారు. వ్యాధులు రాకముందే హెచ్చరించి దానికి అనుగుణంగా చికిత్సలు అందేలా చేయటమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.
జూలైలో కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్ గా ప్రారంభించామన్న చంద్రబాబు.. మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దీనిని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి అవసరమైన ప్రతీ అంశాన్ని సంజీవని ప్రాజక్టు ద్వారా పర్యవేక్షిస్తామని భరోసా కల్పించారు.
డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్ గా మార్చి పర్యవేక్షణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా వైద్యసేవలు పొందేలా చర్యలు చేపట్టబోతున్నట్లు ప్రజలకు తెలియజేశారు. సంజీవని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సిటిజన్ వెల్ నెస్ మిషన్ అన్న సీఎం.. ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ కేర్ కోసం సంజీవని ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. అత్యుత్తమ వైద్య సేవలతో పాటు ఆధునిక వైద్యం ఇంటి వద్దే వర్చువల్ గా అందించేలా సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతున్నట్లు వివరించారు.

