రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు పదవుల ద్వారా రెండు సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ప్రకాశ్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాజు తీవ్రంగా స్పందిస్తూ, తన ఆస్తులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అంతేకాకుండా, ప్రకాశ్ రెడ్డి ఇంటికి వస్తానని హెచ్చరించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, తన ఇంటి వద్ద పోలీసుల మోహరింపును విమర్శిస్తూ ప్రకాశ్ రెడ్డి బయటకు వచ్చి రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రకాశ్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

