TELANGANA

హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహణ నా కల: సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడమే తన వ్యక్తిగత కల అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

హైదరాబాద్‌‍లోని గచ్చిబౌలిలో ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’తో పాటు గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్‌ను తిరిగి ఒక ప్రధాన క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రస్థానంలో ఇదొక కీలక ముందడుగు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

 

1990 నుంచి 2004 మధ్య కాలంలో హైదరాబాద్ అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా నిలిచిందని, అయితే గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అటువంటి మెగా ఈవెంట్లు జరగకపోవడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో నూతన క్రీడా విధానాన్ని రూపొందించామని తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే నవంబర్‌లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

 

అపారమైన జనాభా కలిగిన భారతదేశం ఒలింపిక్ పతకాల సాధనలో వెనుకబడి ఉండటంపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల విధానపరమైన లోపాలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. చిన్న వయసులోనే ప్రతిభావంతులను గుర్తించి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడలు కూడా ఉపాధికి, ఉజ్వల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

2036 ఒలింపిక్స్‌కు హైదరాబాద్‌ తరఫున బిడ్ దాఖలు చేయాలని లేదా భారత్‌కు ఆ అవకాశం దక్కితే కనీసం కొన్ని క్రీడా విభాగాలనైనా ఇక్కడ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే గచ్చిబౌలి స్టేడియాల ఆధునికీకరణ, నూతన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి నిర్మాణాతక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు