TELANGANA

గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాలు..!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.

 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, నాయకులు మధు యాష్కీ గౌడ్, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, కల్వ సుజాతతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

 

తెలంగాణ జానపద సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో భాగంగా, భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ‘బోనం’ సమర్పించారు. అన్నం, బెల్లం, పెరుగుతో నింపిన కుండలను నైవేద్యంగా నివేదించి, అంటువ్యాధుల నుంచి రక్షించి, పాడిపంటలతో రాష్ట్రాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తిగీతాల ఆలాపనలతో గోల్కొండ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

 

చారిత్రాత్మక గోల్కొండ కోటలో మొదలైన ఈ ఉత్సవాల కోసం హైదరాబాద్ పోలీసులు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోల్కొండ బోనాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ జాతర, రాబోయే వారాల్లో సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం సహా నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ వైభవంగా కొనసాగనుంది.