TELANGANA

‘ఆమెతో ఏడాదిగా రిలేషన్.. ఆధారాలు ఉన్నాయి’.. సూసైడ్ నోట్‌లో ట్రెయినీ ఐపీఎస్ సంచలనాలు..!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కుమార్ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడే ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. దాంట్లో తన ఆత్మహత్యకు నలుగురు కారణమని ఉదయ్ కుమార్ రాసినట్టు సమాచారం. ఇక, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రెయినీ మహిళా ఐపీఎస్ తో తాను సంవత్సర కాలంగా రిలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

 

సదరు మహిళా అధికారికి పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె తనంతట తానే తన గదికి వచ్చిందని ఉదయ్ కుమార్ రెడ్డి సూసైడ్ నోట్ లో రాసినట్లు సమాచారం. ఆమెను తాను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లినట్టు చేసిన ఆరోపణ కూడా నిజం కాదని పేర్కొన్నట్టు తెలిసింది. సదరు మహిళా అధికారితో ఉన్న సంబంధానికి సంబంధించి అన్ని రకాల వీడియోలు, కీలక ఆధారాలు ఉన్నాయని ఉదయ్ లేఖలో రాశారట. కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాలు తన మెుబైల్ లోనే భద్రంతా ఉన్నట్లు సూసైడ్ నోట్ లో తెలిపారట.

 

తోటి మహిళా అధికారిణితో ఉన్న రిలేషన్ గురించి.. ఆమె భర్తకు సైతం స్వయంగా తాను తెలియజేసినట్లు ట్రెయినీ ఐపీఎస్ సూసైడ్ నోట్ లో రాశారు. ఈ వ్యవహారంలో తన మరణానికి మరో నలుగురు వ్యక్తులు ప్రధాన కారణమని ఆరోపించారు. ప్రస్తుతం సూసైడ్ నోట్ బయటకు రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు మెుదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆధారాల కోసం ఫోన్ ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సమాచారం. ఇక ఉదయ్ రాసిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరన్న దానిపై కూడా పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం.