TELANGANA

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది: సీఎం రేవంత్‌..

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని అన్నారు. కేంద్రం తీరు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. బ్రిటన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

బ్రిటన్‌ పర్యటనకు అనుమతించారని, కానీ అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. తన పర్యటనలో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. ఏదైనా దాపరికం ఉందని విదేశాంగ శాఖ భావిస్తే అందుకు కారణాలను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

విదేశాల్లో ఉన్నప్పుడే ఈ అంశంపై స్పందిస్తే తనను దేశద్రోహి అంటారని రేవంత్‌ అన్నారు. అందుకే భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత స్పందిస్తున్నానని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే తన పర్యటన ఉద్దేశమని తెలిపారు.

అమెరికా పర్యటనకు తాను వెళ్లలేకపోయినా రాష్ట్ర అధికారులు అక్కడికి వెళ్లారని రేవంత్‌ చెప్పారు. పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోబోతున్నామని తెలిపారు.

గుజరాత్‌ సీఎంకు విదేశీ పర్యటనలకు అనుమతులు ఇస్తున్నారని రేవంత్‌ అన్నారు. తెలంగాణ సీఎంకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇది వివక్షకు నిదర్శనమని ఆరోపించారు. గుజరాత్‌ గుత్తాధిపత్యానికి ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడాన్ని అడ్డుకోవడమే కేంద్రం నిర్ణయం ఉద్దేశమని రేవంత్‌ విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ఎంపీలకు అవసరం లేదా అని నిలదీశారు.