AP

నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎప్పుడు యాక్టివ్ అవుతారు..? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎప్పుడు చర్చ ఉండే అంశం ఇది.

తనకు రాజకీయాలు ఆసక్తి లేదని తారక్ చెబుతున్నా.. ఆయన పేరు మాత్రం ఎప్పుడు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ.. స్టార్ క్యాంపెయినర్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు కూడా చేశారు. టీడీపీకి వారసుడొచ్చాడంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ వాక్చాతుర్యం చూసి రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉందని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేశారు. అయితే ఆ ఎన్నికల తరువాత ఎన్టీఆర్ రాజకీయాలకు దూరమయ్యారు. కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టారు. 2014, 2019 ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తరువాత ఎన్టీఆర్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడుతుండడంతో వారసుడిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నుంచే డిమాండ్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎన్టీఆర్ రావాల్సిందేనని ఎప్పటి నుంచో అంటున్నారు. అయితే రాజకీయ ప్రవేశంపై ఎన్టీఆర్ ఎప్పుడు పెదవి విప్పడంలేదు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అంటున్నారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తరువాత తెలుగుదేశం పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆరే ఎప్పటికైనా నాయకుడు అని అన్నారు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా.. ఎన్టీఆర్‌ను తీసుకురావలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. లోకేష్ మరో పది పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేరని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని.. మరో 30 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టంచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేపర్‌పై పనులు మంజూరు చేసి.. కమీషన్లు కొట్టేశారని మండిపడ్డారు.

ఇక కర్నూల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న చెన్నకేశవ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం అనుమానంగా మారింది. వయసు రీత్యా ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగుసార్లు చెన్నకేశవ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విధేయుడిగా ఆయనకు పేరుంది. 2004 ఎన్నికల్లో తొలిసారి తన గురువు, నాలుగుసార్లు ఎమ్మెల్యే బీవీ మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్ కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2012 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. తన తనయుడి జగన్ మోహన్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడంతో 2019 ఎన్నికల్లో మళ్లీ చెన్నకేశవరెడ్డినే పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారు. దీంతో మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.