AP

వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెండ్రోజుల విరామం ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన గత కొన్నిరోజులుగా వారాహి నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్నారు.

ఉపవాసంతో కొద్దిగా నీరసించిన పవన్ కళ్యాణ్ జ్వరంతో మరింత నీరసించారు. వారాహి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. పవన్ సోమవారం రాత్రి నరసాపురం సభ అనంతరం భీమవరం చేరుకున్నారు. భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు. తొలి విడత 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది.

పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో భేటీని వాయిదా వేశారు. అయితే ఈ భేటీ మధ్యాహ్నం తరువాత జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ అది కూడా వీలుపడలేదు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ (అవిశ్రాంతంగా వారాహి యాత్రలో పాల్గొంటున్నారు. దీనితో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.