AP

జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి.. తిరనాళ్లలో తప్పిపోయినట్లు లోకేష్- కొడాలి సెటైర్లు..

చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే వైసీపీ నేతల జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటారు. సందర్భం దొరికితే చాలు చంద్రబాబుపైనా, ఆయన కుమారుడు లోకేష్ పైనా కొడాలి తనదైన శైలిలో రెచ్చిపోతుంటారు.

చంద్రబాబు అరెస్టుపై ముందుగానే స్పందించిన కొడాలి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అరెస్టుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి విమర్శలకు దిగారు.

చంద్రబాబు,లోకేష్, భువనేశ్వరిపై వైసీపీ నేత కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని కొడాలి విమర్శించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది..? అని ఆయన ప్రశ్నించారు. రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా..? అని అడిగారు.

లోకేష్ తమ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాడని, తాము లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని కొడాలి పేర్కొన్నారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అని అడిగారు. అడెవడో స్టార్ వస్తే వాడిని లోకేష్ అన్నయ్య అంటాడని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఓ పక్కన అన్నయ్యను, మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడన్నారు.

2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారని, హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా అని కొడాలి ప్రశ్నించారు. తన భర్తకు వసతుల్లేవు, వేణ్నీళ్లు లేవని భవనేశ్వరీ అంటున్నారని, ఏసీలు.. ఫ్రీజ్ లు, కూలర్లు, బెడ్స్ ఉండడానికి అదేం ఇల్లు కాదు జైలు అన్నారు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలన్నారు.

 

జైల్లో ఉంటే దోమలు కుట్టక రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా అని చంద్రబాబుపై కొడాలి సెటైర్లు వేశారు. చంద్రబాబు ఏదో అరెస్ట్ అయ్యాడూ, బాబ్బాబు మాట్లాడండంటూ కొందరు పక్క రాష్ట్రం నేతలను బతిమాలితే మాట్లాడారన్నారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు, బాబుతో పాటు జైలుకెళ్తారా అని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు కోసం ఎవ్వరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారన్నారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మోళ్లు మాత్రమే అన్నారు.

 

పొరుగు దేశాలు, రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా చంద్రబాబు అరెస్టుపై నిరసనలు చేస్తున్నారా అని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు టీడీపీని కమ్మోళ్ల పార్టీగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో కమిషన్లకు కక్కుర్తి పడేవాడని, కుటుంబ సభ్యులు వచ్చాక కమీషన్లెందుకు మొత్తం స్వాహా చేద్దామని చెప్పారన్నారు. దోపిడీ సొమ్మును కుటుంబ సభ్యులకు కన్వెర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఎవరున్నారు..? ఒంటికాయ శొంఠి కొమ్ములా లోకేష్.. ఓ భార్య.. ఓ కోడలు అంతేగా అని కొడాలి సెటైర్లు వేశారు. ఆ ముగ్గురే ములాకాత్ కు వెళ్తోంది, కుటుంబ సభ్యులంటూ వేరే వార్ని ఎవరినైనా రానిస్తున్నారా..? అని అడిగారు.