AP

ఏపీలో త్వరలో డీఎస్సీ ? మంత్రి బొత్స హింట్ ! జగన్ షిఫ్టింగ్, లోకేష్-షా భేటీపై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వ్రకటించారు. ప్రస్తుతం డీఎస్సికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని తెలిపారు. డీఎస్సీ వివరాలు త్వరలోనే చెప్తామని బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీ ఐఐటీలో ప్రొఫెస్సర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందన్నారు.

మరోవైపు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని బొత్స విమర్శించారు.మాట్లాడే అంశాలు ప్రజలకు ఎంత ఉపయోగం అన్న విషయాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యత విద్య. ఎన్ ఈ పీ అమలు కావొచ్చు, ఇతర అంశాలు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఉంటాయన్నారు. బైజుస్ తో చేసుకున్న ఒప్పందం లో ఎక్కడా ఆర్థికపరమైన అంశాలు లేవన్నారు. బైజూస్ సంస్థ ఉచితంగానే కంటెంట్ ఇస్తోందన్నారు. 5.18 లక్షల ట్యాబ్ లు 8 తరగతి విద్యార్దులకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ ఏడాది మూడేళ్ల కు సంబధించిన కంటెంట్ ను ట్యాబ్ ల్లో పెట్టి ఇస్తామని బొత్స తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో గందరగోళం సృష్టించ వద్దనీ రాజకీయ పార్టీలను ఆయన కోరారు. టోఫెల్ కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచ వ్యాప్తం గా అందరికీ తెలుసన్నారు. సెలబ్రిటీ పార్టీ గా ఉన్న ఓ రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు.ప్రైమరీ స్థాయిలో 6.30 లక్షల మందికి, జూనియర్ స్థాయిలో 14 లక్షల మంది కి పరీక్షలు ఉంటాయని బొత్స వివరించారు.

ప్రస్తుతం ఒక్కో పరీక్ష కు ఒక్కొక్కరికి 7 రూపాయల చొప్పున చెల్లించాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఆఖరున జరిగే పరీక్షకు 600 రూపాయలు ఉంటుందని, సాలీనా 80 వేల మందికి ఈ తుది పరీక్ష జరుగుతుందన్నారు.

20 లక్షల మంది విద్యార్థులకు ఏటా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పేముందని మంత్రి బొత్స ప్రశ్నించారు. మాట్లాడే పరీక్షకు 2500 రూపాయల వ్యయం అవుతుందన్నారు. 2027 వరకూ అయ్యే ఖర్చు 145 కోట్లు అన్నారు. అప్పటి వరకూ మా ప్రభుత్వమే అధికారం లో ఉంటుందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంచాలని ప్రయత్నం చేస్తే అడ్డుపుల్ల వేస్తున్నారని ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్ విశాఖకు వెళ్ళే అంశం పై అధికారికంగా జీవో ఇస్తే ఇక దొడ్డిదారి ఏమిటని ఆయన మీడియాను ప్రశ్నించారు. విశాఖ తో పాటు కడప లోనూ సీఎం కు క్యాంప్ ఆఫీస్ ఉందని గుర్తుచేసారు. ఉగాదికి సెలబ్రిటీ పార్టీ, టీడీపీ ఉండవనే తాను భావిస్తున్నట్లు బొత్స తెలిపారు. ఎన్నికల తరువాత మేము రిపీట్ వాళ్ళు ఎగ్జిట్ అవుతారంటూ వ్యాఖ్యానించారు. హోమ్ మంత్రి అమిత్ షా ను బాధలు చెప్పుకునేందుకు నారా లోకేష్ కలిసి ఉంటారన్నారు. సీఎం పై చాడీలు చెప్పడానికే కలిశారన్నారు.

అయినా ఎవరితో కలిసి వెళ్లారు ఆన్న అంశం తమ పార్టీకి అవసరం లేదన్నారు. దేశానికి హోమ్ మంత్రి గా అమిత్ షా ను ఎవరైనా కలవొచ్చన్నారు. బీజేపీకి ప్రతీ అంశమూ చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.