AP

అమెరికా కాదు అంతరిక్షం నుంచి వచ్చినా.. గుడివాడలో టీడీపీ ఎన్నారై ఇన్ ఛార్జ్ పై కొడాలి ఫైర్..

గుడివాడలో తనను ఓడించేందుకు టీడీపీ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై వెనిగండ్ల రామును ఇన్ ఛార్జ్ గా ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీని ఓడించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై కొడాలి ఫైర్ అయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రతి ఎన్నికలో డ్యూటీ ఎక్కి, దిగినట్లు ఒక అభ్యర్థి వచ్చి వెళుతూ ఉంటారన్నారు.

 

తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు అమెరికా నుండి కాదు కదా అంతరిక్షం నుండి వచ్చినా, గుడివాడలో వైసీపీని ఓడించలేరని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎన్నికల అనంతరం తిరిగి గత ఇన్ ఛార్జ్ రావి వెంకటేశ్వరరావుకే బాధ్యతలు ఇస్తారని కొడాలి జోస్యం చెప్పారు. పక్క రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా చంద్రబాబు వల్లే గెలిచారంటూ పచ్చ సైకోలు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే నవ్వొస్తుందని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు.

 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలవకున్నా, సిగ్గు లేకుండా పచ్చ బ్యాచ్ గాంధీ భవన్ ముందు టీడీపీ జెండాలతో గంతులు వేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని కొడాలి మండిపడ్డారు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, బెంగాల్ మాదిరి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్ దశాబ్దాల పాటు ఏపీ సీఎం గా కొనసాగుతారన్నారు. ప్రజలకు దూరమైన చంద్రబాబు ఎన్నటికీ సీఎం కాలేరని,తెలుగుతమ్ముళ్ళు కేవలం పగటి కలలకే పరిమితం అవుతారని నాని ఎద్దేవా చేశారు.

 

చంద్రబాబు శిష్యులు సీఎంలు అవుతుంటే, సీఎం కాలేనని తెలుసుకున్న చంద్రబాబు మాత్రం వెక్కివెక్కి ఏడుస్తున్నారని కొడాలి నాని అన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో ఏ ఫలితాలు అయితే వచ్చాయో,ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా టిడిపి, జనసేనకు అవే ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే నాని జోస్యం చెప్పారు. కేవలం ప్రతిపక్ష హోదా కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో దోస్తీ చేస్తున్నాడని ఎమ్మెల్యే నాని అన్నారు.