AP

టీడీపీ వైపు వైసీపీ ఎంపీల చూపు..

ఏపీలో ఎన్నికల వేళ పార్టీ మార్పులు మొదలయ్యాయి. వైసీపీలో అభ్యర్దులు ఖరారులో సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని పైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.

 

వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు : వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. కొందరు సీనియర్లను ఎంపీలుగా పోటీ చేయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు విడతలుగా 38 మందిని మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. మరో విడత జాబితా పైన కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి లోగా పూర్తి స్థాయిలో అభ్యర్దులను ఖరారు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నెలలో వరుసగా సంక్షేమ పథకాలు అమలుకు ముహూర్తం నిర్ణయించటంతో వాటి అమలు వేళ కొత్త అభ్యర్దులు ప్రజలతో మమేకం అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

 

YCP MP Vemireddy Prabhakar Reddy gave clarity on contesting in next Elections from Nellore

ఎంపీ సీట్ల లెక్కలు : ఈ సమయంలోనే నర్సరావుపేట, ఒంగోలు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీతో టచ్ లోకి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నర్సారావు ఎంపీ లావు క్రిష్ణదేవరాయులు తనకు ప్రస్తుత సీటు నర్సరావు పేట కొనసాగించాలని కోరారు. గుంటూరు నుంచి పోటీ చేయాలనే సూచన పైన విముఖత వ్యక్తం చేసారు. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మాగుంట కుమారుడుకు సీటు పైన మంతనాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం టీడీపీతో మంతనాలు చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. దీని పైన స్పందించిన వేమిరెడ్డి తాను పార్టీ మారటం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసారు. ఉద్దేశ పూర్వకంగానే తన పైన దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

వేమిరెడ్డి క్లారిటీ : నెల్లూరు లోక్ సభ పరిధిలో మూడు స్థానాల్లో అభ్యర్దులను మార్పు చేయాలని వేమిరెడ్డి సీఎం జగన్ వద్ద ప్రతిపాదించారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదు. ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి బరిలోకి దింపుతున్నారు. ఇదే జిల్లా నుంచి వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటంతో ఇక్కడ ప్రతీ సీటు గెలుపు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎంపీ వేమిరెడ్డికి లోక్ సభ సీటు ఖరారు చేసారు. పార్టీ ఎంపీల మార్పు పైన జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ తాను వైసీపీలోనే కొనసాగుతానని వేమిరెడ్డి స్పష్టం చేసారు