AP

మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ కక్ష సాధింపే… వైసీపీ సర్కారుపై చంద్రబాబు నిప్పులు..

మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమ అరెస్ట్ ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు తెలుగుదేశం దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తెలుగుదేశంపార్టీ నాయకులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

 

వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని విమర్శించారు. శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

 

ఏపీఎస్‌డీఆర్ఐ APSDRI ఎందుకు ఏర్పడింది… దాని అసలు లక్ష్యాలేమిటి.? మూడేళ్లుగా వాళ్ళు పెట్టిన కేసులెన్ని? ఎవరెవరిపై కేసులు పెట్టారు అనే వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా? టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు APSDRI ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు. APSDRI బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించకతప్పదంటూ చంద్రబాబు హెచ్చరించారు.

 

పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్టుతో ఉద్రిక్తత

 

ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మొదట శరత్ కోసం టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద ఆరా తీసిన ప్రతిపాట్టి పుల్లారావు.. ఆ తర్వాత ఆచూకీ చెప్పాలంటూ సీపీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లడానికి అనుమతించకపోవడంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్, పట్టాభిరామ్, పిల్లి మాణిక్యాలరావును లోపలికి అనుమతించారు.