AP

ఇది వైసీపీ సర్కారు ఆఖరి ప్రయత్నమా?: చంద్రబాబు ఆగ్రహం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రికలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు హయాంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు.

 

‘జగన్‌రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, ప్రతిపక్షాల నుంచి పత్రికాధినేతలపై, పార్టీ కార్యకర్తలపై దాడికి పురికొల్పుతున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.

 

కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడాన్ని నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇటీవల ఆంధ్రజ్యోతి, టీవీ5, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్‌పై దారుణంగా దాడి చేసి తీవ్ర గాయపర్చడం అనాగరికమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

‘భారీ ఓటమి ఖాయమనే ధీమాతో జగన్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, పత్రికలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడికి పురిగొల్పుతున్నారు. ఈ హింసాత్మక చర్యలు, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఆఖరి ప్రయత్నం. రాష్ట్రంలో 50 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని చంద్రబాబు అన్నారు. ఏపీ గవర్నర్, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు తాను చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు చంద్రబాబు.