AP

ఏపీ లిక్కర్ స్కాం లో ఈడి ఎంట్రీ..! వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా..?

వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా? లిక్కర్ కేసులో నేతలకు దారులు మూసుకుపోతున్నాయా? నిన్నటికి నిన్న ముగ్గురు నిందితులకు ముందస్తు బెయల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటరైంది. దీంతో వైసీపీ కీలక నేతల్లో అసలు టెన్షన్ మొదలైంది. ఇక తమ పని అయిపోయినట్టేనని అంటున్నారు.

 

వైసీపీ నేతలు బెంబేలు

 

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. ఈ కేసుపై ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ, మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. ఆపై కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేఖ రాసింది. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చింది.

 

మద్యం ముడుపుల కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను నిందితులుగా చేర్చింది. రేపో మాపో వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన వేల కోట్ల రూపాయల మూలాలను వెలికి తీసేందుకు రెడీ అయ్యింది.

 

ఈడీ ఎంటర్, సిట్‌కు లేఖ

 

సిట్ అధికారులకు ఈడీ రాసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధం ఉన్నవారు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారం ఇవ్వాలన్నది అందులో ప్రధాన పాయింట్. అలాగే ఈ కేసులో అరెస్టయిన నిందితులు, వారి రిమాండ్ రిపోస్టులు, ఛార్జిషీటు దాఖలు చేస్తే వాటి వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వాలని ప్రస్తావించారు.

 

లిక్కర్ కేసులో ఈడీ ఎంటరైన విషయం తెలియగానే అందులో ప్రమేయమున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ కేసు తమ మెడకు చుట్టుకునే అవకాశముందని బెంబేలెత్తుతున్నారు. తమకు తెలిసిన దగ్గర బంధువులకు ఫోన్ చేసి తమ గోడు వెల్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియన తర్జనభర్జన పడుతున్నారు.

 

టీడీపీ పోరాటం

 

లిక్కర్ కుంభకోణంపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. పార్లమెంటు సమావేశాల్లో కూడా దీని గురించి పదేపదే ప్రస్తావిస్తోంది. దీనిపై కేంద్రం దృష్టి పెట్టి అసలు నిందితులను బయటకు తీయాలని పలుమార్లు ప్రస్తావించింది. ఆ ఒత్తిడి ఫలితమూ ఏమోగానీ ఈడీ ఎంటర్ అయ్యింది. ఈడీ దిగడంతో తొలి అరెస్టు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజాప్రతినిధులు ఉంటారా? లేక షెల్ కంపెనీల ఓనర్లు ఉంటారా అనేది ఇక్కడ సస్పెన్ష్‌గా మారింది.

 

ఢిల్లీ మాదిరిగా అడుగులు?

 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేవలం రూ. 100 కోట్లు చేతులు మారాయన్న దానిపై ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఎంపీ, పాలసీ మార్చిన కొందరు నేతలను సైతం అరెస్టు చేసింది ఈడీ. ఆ తర్వాత ఇదే కేసులో సీఐబీ దిగింది. అందులో కొందరు అప్రూవర్ కావడంతో బయటపడ్డారు.

 

మరి ఏపీ లిక్కర్ కేసులో అప్రూవర్‌గా మారేదెవరు? ఈ కేసులో ఎవరికివారు తప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా? ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినవారిని అరెస్టు చేసి, చివరలో పెద్దవారిని అదుపులోకి తీసుకోవాలని ఈడీ ఆలోచన చేస్తుందా? అవుననే అంటున్నారు. మొత్తానికి లిక్కర్ కుంభకోణం మాత్రం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పవచ్చు