TELANGANA

క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్‌,..!

ఆపరేషన్ సిందూర్‌తో సరిహద్దులు ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్‌తో కర్రెగుట్టల రక్తమోడాయి. కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. చంద్రన్న దళంతో భద్రత బలగాలు భీకర యుద్ధమే చేస్తున్నాయి. నూగూరు శివారు పెద్దగుట్ట దగ్గర భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 4 గంటల పాటు హోరాహోరాగా ఫైరింగ్ కొనసాగింది. మావోయిస్టుల తూటాలకు ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదే ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో సహా 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. కీలక నేత చంద్రన్న మరణించడంతో.. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే. ఇక, మోస్ట్ వాంటెడ్ హిడ్మానే మెయిన్ టార్గెట్.

 

హెవీ మెషీన్ గన్స్‌తో కాల్చారా?

 

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్రేహౌండ్స్ సిబ్బందిని RSI శ్రీధర్, సందీప్, పవన్ కల్యాణ్‌గా గుర్తించారు. ఈ ముగ్గురూ 25 ఏళ్ల లోపు వాళ్లే కావడం విషాదకరం. వారి ఒంటి నిండా ఎక్కువ సంఖ్యలో బుల్లెట్ గాయాలున్నాయి. మావోయిస్టులు హెవీ మెషీన్ గన్‌తో కాల్పులు జరిపారని భావిస్తున్నారు. అయితే, ఉదయం ల్యాండ్ మైన్‌ పేలి ఆ ముగ్గురు మరణించారని వార్తలు వచ్చాయి కానీ, బుల్లెట్ గాయాలతోనే చనిపోయారని తర్వాత తెలిసింది. ఇద్దరు క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడినట్టు వైద్యులు తెలిపారు.

 

డీజీపీ, డీజీ నివాళులు

 

కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్రేహౌండ్‌ పోలీసులకు వరంగల్ MGM హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం చేశారు. తెలంగాణ DGP జితేందర్, అడిషనల్ DG స్టీఫెన్ రవీంద్రలు హుటాహుటిన వరంగల్ తరలివెళ్లారు. మృతులకు నివాళులు అర్పించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

క్లైమాక్స్‌లో ఆపరేషన్ కర్రెగుట్టలు

 

కాల్పులు ముగియడంతో బలగాలు మళ్లీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పేరూరు – లంకపల్లి అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికి 16 రోజులుగా కర్రెగుట్టల్లో నాన్‌స్టాప్ కూంబింగ్ జరుగుతోంది. ఎండవేడికి వడ దెబ్బతో అనేక మంది జవాన్లు ఆసుపత్రి పాలవుతున్నారు. అయినా, కర్రెగుట్టల్లో తగ్గేదేలే అంటూ భద్రతా బలగాలు మావోయిస్టులను వెంటాడుతున్నాయి. గుట్టెల నిండా మావోయిస్టులు పాతి పెట్టిన ల్యాండ్ మైన్లు పోలీసులకు అడుగడుగునా సవాళ్లుగా మారుతున్నాయి.