కర్నూలు జిల్లాలో మనసును కలచివేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి (35) అనే మహిళ తన ఇద్దరు కుమారులు అబ్రహం (3), సుకుమార్ (6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. శనివారం ఉదయం వీరి ముగ్గురి మృతదేహాలు చెరువులో తేలడంతో స్థానికులు షాక్కు గురయ్యారు.
మృతురాలు రాజేశ్వరి గత కొంతకాలంగా భర్తతో మనస్పర్థల కారణంగా గొడవపడి పుట్టింట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. మార్చి 13వ తేదీ సాయంత్రం పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన ఆమె, ముందుగా చిన్నారులను చెరువులోకి తోసేసి, ఆపై తాను కూడా దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
క్షణికావేశంలో తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు పసిపిల్లల ప్రాణాలను బలితీసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సమస్యలే కారణమా లేక మరేదైనా వేధింపులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ విషాద ఘటనతో గార్గేయపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

