CINEMA

బాలీవుడ్ సీనియర్ స్టార్ తో రామ్ గోపాల్ వర్మ హార్రర్ సినిమా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వ‌ర్మ స‌క్సెస్ అందుకుని చాలా కాల‌మైంది. ప్రయ‌త్నాలైతే చేస్తున్నాడు గానీ ఫ‌లితం మాత్రం దక్కడంలేదు. ఆ సినిమా తీస్తాను? ఈ సినిమా తీస్తాన‌ని ప్రక‌ట‌నలు చేస్తున్నాప్పటికి. అవి అక్కడికే ప‌రిమితం అవుతున్నాయి తప్ప ప్రక‌టించిన ఏ ప్రాజెక్ట్‌ కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఇటీవ‌లే మ‌ళ్లీ పాత వర్మని చూపిస్తాన‌ని ప్రామిస్ చేసాడు. కానీ అది ఇంకా జ‌ర‌గ‌లేదు.. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌ర్మ మ‌రో కొత్త చిత్రాన్ని ప్రక‌టించాడు. అది కూడా దెయ్యం మీద. కెరీర్ ఆరంభంలో వర్మ ‘భూత్’ ‘12 వ అంతస్థు’, ‘రాత్రి’, ‘కౌన్’, ‘దెయ్యం’, ‘మర్రి చెట్టు’ లాంటి చాలా సినిమాల‌తో ప్రేక్షకుల్ని భ‌య‌పెట్టి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. హర్రర్ మూవీస్ బాగా తీసేవాడు.

 

ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌ర్మ ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే కొత్త హార‌ర్ చిత్రాన్ని ప్రక‌టించారు. ‘మీరు చనిపోయిన వారిని చంపలేరు’ అనేది ట్యాగ్‌లైన్. ఇందులో మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. స్టోరీకి సంబంధించి ఇంకా లోతును వ‌ర్మ పంచుకున్నారు.. ‘మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు వెలతాము. కానీ పోలీసులు భయపడినప్పుడు ఎక్కడికి పరిగెత్తుతారు? అన్న పాయింట్ మీద‌నే క‌థాంశం తిరుగుతుంది. ఒక ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దెయ్యాల స్టేషన్‌గా మారుతుంది. గ్యాంగ్‌స్టర్ల దయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరిగెత్తుంటారు’ అని తెలిపాడు. కాగ తన మాటలో ఈ సినిమాపై వ‌ర్మ చాలా కాన్పిడెంట్‌గా ఉన్నట్లు క‌నిపిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.