CINEMA

బండ్ల గణేశ్ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు: ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి సందడి

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla ganesh) తన నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక సందర్భానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బండ్ల గణేశ్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనాన్ని ఏర్పాటుచేయడం, ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించడం హైలైట్‌గా నిలిచింది. చిరంజీవి కారు దిగగానే బండ్ల గణేశ్ స్వయంగా వారిని స్వాగతించి, పాదాల వద్ద నమస్కరించి, ఆత్మీయంగా చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు.

ఈ వేడుకలకు విక్టరీ వెంకటేశ్, సిద్దు జొన్నలగడ్డ, శ్రీకాంత్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వంటి సుప్రసిద్ధ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా హాజరై సందడి చేశారు. చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ బండ్ల గణేశ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. “మా బాస్ చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారని తెలుసుకుని ప్రత్యేకంగా సింహాసనం తయారు చేశాను. ఆయన ఆ కుర్చీలో కూర్చున్న క్షణం నా మనసును ఉప్పొంగింపజేసింది. లవ్ యూ అన్నయ్య!” అని ఆయన తెలిపారు.

ఈ పార్టీ ద్వారా బండ్ల గణేశ్ కొన్ని నెలల విరామం తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో చురుగ్గా కనిపించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఆయన కోసం సింహాసనాన్ని ఏర్పాటుచేయడం ఈ వేడుకల్లోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.