స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు బంపరాఫర్ లభించినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం (స్పెషల్ సాంగ్) కోసం ఆమెను సంప్రదించినట్లు, ఇందుకోసం ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఆమెకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలోని ఈ చిత్రంలో పూజా హెగ్డే చేసే ఐటమ్ సాంగ్ సినిమా విజయానికి కచ్చితంగా ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు పూజా హెగ్డే కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ను సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో వేగంగా జరుగుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్టులో అల్లు అర్జున్ సరసన ఏకంగా ఆరుగురు కథానాయికలు నటించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. వారిలో దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి ప్రముఖ తారల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

