National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లో ప్రచార పర్వంలో ఆ పార్టీ దూసుకుపోతోంది.

పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట స్పెషల్ ఫోకస్ చేస్తూ.. ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టకునేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోయి ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తున్న నేతలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఎలాగైనా వారిన ఓడించాలనే పట్టుదలతో ఉంది. టికెట్లు దక్కలేదని.. పార్టీలో గౌరవం లేదని వివిధ కారణాలతో బీజేపీ చెందిన 10 మంది సీనియర్ నాయకులు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోయారు. అక్కడ టికెట్లు దక్కించుకుని బీజేపీ అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు. గత ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఆగిపోయిన బీజేపీ.. ఈసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావాలంటే ఈ సీట్లు గెలవడం చాలా కీలకంగా మారింది. అందుకే పార్టీ ఫిరాయింపుదారులకు చెక్ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ ఎన్నికల వ్యూహకర్త అమిత్ షా పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ నుంచి వెళ్లి పోయి ఇతర పార్టీల్లో పోటీ చేస్తున్న నేతల స్థానాల్లో గెలుపు కోసం స్పెషల్ ప్లాన్ వేశారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్ పోటీ చేస్తున్న హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ సీటుపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి అక్కడి నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మహేష్ కుమతల్లిని పోటీ చేస్తున్నారు.

పార్టీ ఫిరాయించిన నేతల స్థానాలను గెలుచుకునేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు చల్వాడి నారాయణస్వామి వెల్లడించారు. అమిత్ షా హుబ్లీ పర్యటన సందర్భంగా ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్, బెలగావి, ఇతర జిల్లాల్లో ప్రచారం జోరుగా నిర్వహించారు. స్థానిక నాయకులతో మాట్లాడారు. ఇప్పటికే గ్రౌండ్‌ లెవల్లో ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న టీమ్‌తో పాటు.. మరికొంత మందిరి రంగంలోకి దింపాలని అమిత్ షా సూచించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ర్యాలీలు, రోడ్ షోలను పార్టీ ఫిరాయించిన నేతల స్థానాల్లో ఎక్కువగా ఉండేట్లు ప్లాన్ చేశారు.

ప్రస్తుతం ధార్వాడ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా జగదీష్‌ శెట్టర్‌ను ఓడించేందుకు హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ సీటు బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్వయంగా తీసుకున్నారు. బీజేపీలో శెట్టర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా.. ద్రోహం చేశారని ఆయన అన్నారు. శెట్టర్‌ను నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ క్షమించరని.. ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.