CINEMANational

దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం

ర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్‌(ISBC)కు గౌరవ చైర్మన్‌గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి క్రికెటర్లుగా ఎదగాలనుకునేవారిని ఈ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తుంది.

మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ గైడెన్స్ లో ఐఎస్ బీసీ ఏర్పాటైంది. తాను కూడా క్రికెట్ ఆడేవాడినని, ఆ ఆటంటే తనకు చాలా ఇష్టమన్నారు. స్కూల్ టైంలో తమ ఊర్లో క్రికెట్ ఆడేవాడినని రాజమౌళి వ్యాఖ్యానించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన టాలెంట్ ఉంటుందికానీ సరైన ప్లాట్ ఫాం ఉండదని, ISBC ప్రతినిధులు తనను కలిసి రూరల్ క్రికెట్ కోసం పని చేస్తున్నామని, దేశవ్యాప్తంగా విస్తరించి ఉందని, తనను కూడా పనిచేయాలని కోరగా వెంటనే ఒప్పుకున్నట్లు రాజమౌళి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారుల కోసం తాను కూడా శ్రమిస్తానన్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని రాజమౌళి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. తర్వాత సినిమాను మహేష్ బాబుతో తీయనున్నారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఇది రూపుదిద్దుకోబోతోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ దీన్ని నిర్మంచబోతున్నారు. రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలే బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జులై చివరకు పూర్తికనుందని వెల్లడించారు.

ఈ సినిమాకు సీక్వెల్ ను నిర్మించడం కోసం క్లైమాక్స్ సీన్స్ ను ఓపెన్ ఎండ్ గా వదిలేస్తున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో రాజమౌళి-మహేష్ బాబు సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలి వరకు పడుతూ లేస్తూషూటింగ్ జరుపుకున్న గుంటూరు కారం ప్రస్తుతం నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోంది.