National

మాజీ సిఎం కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

రాజస్థాన్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాజీ సిఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌లో సోమవారం ఓ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలోనే ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రాజే కాళ్లు మొక్కిన జైన్‌: దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా రాజస్థాన్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ మాజీ సీఎం రాజే సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బార్మర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మెవరమ్‌ జైన్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో బిజెపి, కాంగ్రెస్ నాయకులంతా వచ్చారు.

అయితే, వారంతా నేలపై కూర్చుని ఉన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే కూడా వచ్చారు. అయితే, ఎమ్మెల్యే మెవరమ్ జైన్ వసుంధరా రాజేను చూసి..అక్కడ నేలపై కూర్చన్న వాళ్లను దాటుకుంటూ వెళ్లి రాజే కాళ్లుమొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో కాస్త ఆ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాన్‌సింగ్ చౌహాన్ ఎందరికో స్పూర్తిదాయకం: ఈ వీడియో చూసిన రాజకీయ నాయకులు పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. జైన్‌ కాళ్లు మొక్కడం చూసిన వసుంధరా రాజే వెంటనే మైక్‌ చేతిలోకి తీసుకుని మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇది మనందరినీ ఏకం చేసేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం అని ఆమె అన్నారు.

ఆ తర్వాత రాజే మాట్లాడుతూ…మీడియా మిత్రులు నా మాటలు వినాలి. ఇది ఒక సామాజిక కార్యక్రమం. ఈ కార్యక్రమం 36 సామాజిక వర్గాలను కలుపడానికి పనిచేస్తుంది అంటూ పేర్కొన్నారు. అనంతరం దివంగత తాన్ సింగ్ చౌహాన్ గురించి మాట్లాడారు. తాన్ సింగ్ చౌహన్ అందరినీ ఏక తాటిపై నడిపించిన వ్యక్తి. డ్రైవర్ ఉద్యోగం నుంచి ఓ ప్రజా నాయకుడిగా ఎదిగిన ఆయన విధానం మనలాంటి వారెందరికో స్పూర్తిదాయకం అని కొనియాడారు.