APNational

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం.. నావిక్-2 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. దాదాపు 2,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపనున్నారు.

 

శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత చేపడుతున్న వందో ప్రయోగం ఇది. అంతేకాదు, ఈ ప్రయోగానికి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నింగిలోకి పంపనున్న నావిక్-2 ఉపగ్రహం నేవిగేషన్ ఉపగ్రహాల సిరీస్‌లో 9వది. నావిక్ సిరీస్‌లో రెండోది. జీఎస్‌ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 17వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్‌తో 11వ ప్రయోగం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నావిక్ ప్రయోగంతో దేశంలోని వినియోగదారులకు కచ్చితమైన స్థానం, వేగం, సమయ సేవలు అందుతాయి. ఈ సిరీస్‌లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.