National

భారత్ దాడిలో పీవోకేలోని జల విద్యుత్ కేంద్రం ధ్వంసం.. ..

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కీలకమైన నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టు (ఎన్‌జేహెచ్‌పీ)ను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు దాడులు చేశాయని, ఈ ఘటనలో ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని పాకిస్థాన్ ఆరోపించింది. మే 6, 7 తేదీల మధ్య రాత్రి ఈ దాడులు జరిగినట్లు పాకిస్థాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో పౌర ప్రాణనష్టం కూడా జరిగిందని పాక్ పేర్కొంది.

 

పాకిస్థాన్ ప్రముఖ వార్తా సంస్థ ‘డాన్’ కథనం ప్రకారం ముజఫరాబాద్ నగర సమీపంలో ఉన్న నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టు ఇన్‌టేక్ నిర్మాణంపై బుధవారం తెల్లవారుజామున భారత దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో ప్రాజెక్టుకు చెందిన “ఇన్‌టేక్ గేట్లు, ఒక హైడ్రాలిక్ ప్రొటెక్షన్ యూనిట్” దెబ్బతిన్నాయని ముజఫరాబాద్ డిప్యూటీ కమిషనర్ ముదస్సర్ ఫరూఖ్ ధ్రువీకరించినట్లు డాన్ పత్రిక తెలిపింది. ఈ ఘటనలో ఎన్‌జేహెచ్‌పీకి చెందిన ఒక అంబులెన్స్ కూడా ధ్వంసమైనట్లు పేర్కొంది.

 

పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధ్రీ మాట్లాడుతూ భారత దళాలు నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని నోసేరి డ్యామ్‌పై దాడి చేసి, దాని ఇన్‌టేక్ నిర్మాణాన్ని దెబ్బతీశాయని తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, డ్యామ్ హైడ్రాలిక్ వ్యవస్థకు చెందిన “డీ-శాండర్స్ యూనిట్ ఇన్‌టేక్ గేట్లు”, “హైడ్రాలిక్ ప్రొటెక్షన్ యూనిట్” దెబ్బతిన్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి.

 

చైనా సహకారంతో 2018లో పూర్తయిన 1,000 మెగావాట్ల నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టు పాకిస్థాన్ జాతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసే కీలకమైన ఇంధన వనరు. ఈ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడం వల్ల ప్రాంతీయ విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల స్థిరత్వంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

జలవనరుల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలను, యుద్ధ నియమాలను ఉల్లంఘించడమేనని పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా ఖండించింది. “ఏ అంతర్జాతీయ నిబంధనలు, యుద్ధ చట్టాలు, సంప్రదాయాలు మరో దేశపు నీటి నిల్వలు, డ్యామ్‌లు, జలవిద్యుత్ నిర్మాణాలపై దాడి చేయడానికి అనుమతిస్తాయి?” అని లెఫ్టినెంట్ జనరల్ చౌధరి ప్రశ్నించారు.

 

ఈ జలవిద్యుత్ ప్రాజెక్టుపై దాడితో పాటు, భారత్ జరిపిన విస్తృత దాడుల్లో మతపరమైన ప్రార్థనా స్థలాలతో సహా పలు ప్రాంతాల్లో 31 మంది పాకిస్థానీ పౌరులు మరణించగా, మరో 46 మంది గాయపడ్డారని పాకిస్థాన్ ఆరోపించింది. అహ్మద్‌పూర్ షర్ఖియాలోని సుభాన్ అల్లా మసీదుపై జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 13 మంది పౌరులు మృతి చెందారని పాక్ వర్గాలు పేర్కొన్నాయి.