POLITICS

ఎంపీ అవినాష్ రెడ్డికి జైలా. బెయిలా?

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా, ఇవాళ్ళ తనను అరెస్ట్‌ చేయవచ్చని భావిస్తున్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు.

దీనిపై మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది.

ఈ కేసులో అరెస్టయిన ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇదివరకు ఇదే హైకోర్టులో వేసిన పిటిషన్‌లో నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకానందరెడ్డి లైంగికంగా వేధించారని అందుకే అతను ఆయనపై కక్షతో హత్య చేశాడని పేర్కొన్నారు. కానీ ఈరోజు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌లో వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులతో, సీబీఐ అధికారి కుమ్మకయ్యి తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే సీబీఐ అధికారులు గూగుల్ టేకవుట్ ఆధారంగా తనను నిందితుడుగా నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీంతోపాటు అవినాష్ రెడ్డి తన తాజా పిటిషన్‌లో మళ్ళీ వివేకా రెండో భార్య, ఆస్తి కోసం సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డే మామను హత్య చేయడం గురించి కూడా ప్రస్తావించారు. అంటే భాస్కర్ రెడ్డి చెపుతున్నట్లు లైంగిక వేధింపుల కారణంగా సునీల్ యాదవ్ చేతిలో వివేక హత్యకు గురయ్యారా లేక అవినాష్ రెడ్డి చెపుతున్నట్లు ఆస్తి గొడవలలో అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేతిలో హత్యకు గురయ్యారా?అనే సందేహం కలుగుతుంది.

ఒకే హైకోర్టులో ఒకే కేసులో తండ్రీకొడుకులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలోనే ఇంత తేడా కనిపిస్తోంది. అంటే వారు చెపుతున్న మాటలు నిజం కావని స్పష్టం అవుతోంది. మళ్ళీ మద్యలో చంద్రబాబు నాయుడు, సీబీఐ కలిసి కుట్ర చేశారని ఆరోపించడం దేనికో అర్దం కాదు.

ఒకవేళ చంద్రబాబు నాయుడుకి దీంతో ప్రమేయం ఉందనుకొంటే, ఆయనను, టిడిపిని రాజకీయంగా దెబ్బతీయడానికి వైసీపీ ప్రభుత్వానికి ఈ కేసు ఓ అద్భుతమైన అవకాశమే కదా? ఏపీలో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు జగన్‌ ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహకరించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసేందుకు తగిన ఆధారాలు అందించవచ్చు కదా? కానీ కేసు విచారణ ముందుకు సాగకుండా సీబీఐ అధికారుల మీదే నిందితులు కేసులు వేశారుగా?

ఒకవేళ సునీతారెడ్డి దంపతులే ఈ హత్య చేశారనుకొంటే వారు కూడా ఈ కేసు విచారణ ముందుకు సాగకూడదనే కోరుకొనేవారు కదా? కానీ సునీతా రెడ్డి స్వయంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేయించుకొన్నారంటే అర్దం ఏమిటి?అసలు వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినది ఎవరు?వివేకా హత్య తర్వాత సాక్ష్యాధారాలు చెరిపేసి హడావుడిగా అంత్యక్రియలు పూర్తిచేయాలని ప్రయత్నించింది ఎవరు?చంద్రబాబు నాయుడు, సునీతారెడ్డా. లేక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులా? అయినా చంద్రబాబు నాయుడు సీబీఐపైని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్నారా ఇప్పుడు?అని ప్రశ్నించుకొంటే పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తోంది కదా?

కనుక నేడు హైకోర్టు ఏం చెప్పబోతోందో, తర్వాత సీబీఐ ఏం చేయబోతోందో తేలికగానే ఊహించుకోవచ్చు.