TELANGANA

నాకు నా భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడు: జానకీపురం సర్పంచ్ నవ్య!!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోమారు టార్గెట్ చేశారు. తనను మళ్ళీ ఎమ్మెల్యే రాజయ్య వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె రచ్చ మొదలుపెట్టారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఆపై ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మేమంతా ఒకటే అని చెప్పిన జానకీపురం మహిళా సర్పంచ్ మళ్ళీ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు.

గత మార్చినెలలో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య తాటికొండ రాజయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కావాలని తనను వేధింపులకు గురి చేస్తున్నారని, తన మాట వినకుంటే పార్టీలో స్థానం లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, పార్టీ కార్యక్రమాలకు వెళితే పక్కనే నిలబడి భుజాలపై చేతులు వేసి ఒత్తుతున్నాడని ఆరోపించారు.

తన మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని చెప్పాడని, తమ గ్రామానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. పార్టీలో పని చేసే కొందరిని మీడియేటర్లుగా పెట్టుకొని వారి ద్వారా తనపై ఒత్తిడి తెస్తున్నారని మహిళా సర్పంచ్ ఆరోపించారు. ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అంటూ రాజయ్య సమాధానం ఇచ్చారు.

ఆపై ఆమెతో జరిగిన చర్చలలో భాగంగా ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మేమంతా ఒకటే, ఎమ్మెల్యేతో కలిసి పని చేస్తానని ఆ మహిళా సర్పంచ్ చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ రాజయ్యను టార్గెట్ చేశారు నవ్య. హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియో టేపులు ఇవ్వాలని నన్ను వేధిస్తున్నారని చెప్పారు.

తనపై కావాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. తనకు, తన భర్తకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎమ్మెల్యే రాజయ్య చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని నవ్య ఆరోపించారు. ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే రాజయ్యపై చర్యలు తీసుకోవాలని జానకీపురం మహిళా సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు.