APTELANGANA

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల డిమాండ్లు అమలుచేసే అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంతో వారు విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు.

కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం​ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌ హైమావతిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు.

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం కమిటీ వేస్తే సమ్మె విరమిస్తామని ఏఎన్‌ఎంలు శుక్రవారం సర్కార్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె విరమించి సెప్టెంబర్ 4 తేదీ నుంచి విధుల్లో చేరుతామని ఏఐటీయూసీ లీడర్‌ ఎం.నరసింహం చెప్పారు.

నెల రోజుల లోపల కమిటీ తన రిపోర్ట్‌ను ఇవ్వకపోతే మరోసారి ఉద్యమిస్తామని నరసింహ హెచ్చరించారు. అయితే కేవలం ఏఎన్‌ఎంల సమస్యలపై మాత్రమే సర్కార్ స్పందించడంపై కాంట్రాక్ట్​ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా కేడర్ల సమస్యలను పట్టించుకోకపోవడంపై ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ బేసిస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్‌ఎంలు 5 వేల మంది ఉంటే, మిగిలిన అన్ని కేడర్లు కలిపి ఆరోగ్యశాఖలో12 వేల మంది ఉన్నారని చెబుతున్నారు.

ప్రభుత్వం తమకూ న్యాయం చేయకపోతే అందరం సమ్మెలోకి వెళ్తామని ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ప్రతినిధి లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలతో వెట్టి చాకిరి చేపిస్తూ కనీస వేతనాలు ఇవ్వకుండా అన్యాయం చేసిందని సమ్మె కాలంలో ఏఎన్ఎంలు ఆరోపించారు. కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కోరారు.