TELANGANA

కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలం: లెక్కలు చెప్పిన చిదంబరం..

తనకు తెలంగాణతో 2008 నుంచి అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన తనకు బాగా గుర్తుందన్నారు. మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.

 

Advertisement

తెలంగాణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశంలోని అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. నిత్యావసర ధరలు బాగా పెరిగాయన్నారు. పాల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలూ తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు.

 

వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని చిదంబరం తెలిపారు. గ్యాస్ ధరలు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉందని వివరించారు. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా.. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉందని చిదంబరం తెలిపారు.

 

‘తెలంగాణలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల‌ మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు.. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది.ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు చిదంబరం.

 

‘తెలంగాణ రాష్ట్ర అప్పులు‌ 3.66 లక్షల కోట్లకు పెరిగింది. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది.దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారింది. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయని చిదంబరం అన్నారు. పోషకాహార లోపం‌ తీవ్రంగా ఉందని తెలిపారు.

 

Advertisement

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో‌ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని చిదంబరం కోరారు. పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌కి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చిదంబరం వ్యాఖ్యానించారు.