TELANGANA

ఏడవాలంటే కాంగ్రెస్ కు.. నవ్వాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యమన్న కేటీఆర్..

మీరు ఏడవాలి అంటే కాంగ్రెస్ కు, నవ్వాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ధర్మపురి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రైతు బంధు బంద్ కావటానికి కారణం కాంగ్రెస్ అన్నారు.

 

పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని ప్రశ్నించారు. ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతుబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..? అని మండిపడ్డారు. వ్యవసాయం చేసే రైతులపైన పగ ఎందుకు..? అని ప్రశ్నించిన ఆయన అన్నదాతకు సాయం అందకుండా అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు అని విరుచుకుపడ్డారు.

 

దుక్కి దున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకో చెప్పాలని నిలదీశారు. అన్నంపెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..? అని ప్రశ్నించిన కేటీఆర్ కర్షకుడికి అవసరం అయినంతగా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు..? 3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు అని ప్రశ్నించారు.

 

రైతుచేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు అని ప్రశ్నించిన కేటీఆర్ దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు, అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు అని అసహనం వ్యక్తం చేశారు.

 

అన్నదాతలారా..మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించాలని పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా ? ఆలోచించాలన్నారు. కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలి అన్నారు. రైతు బంధును ఆదరించాలని, రాబందులను తరిమెయ్యాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణా రాష్ట్రం చచ్చిపోతుందని ఆయన పేర్కొన్నారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పాలు పిండితే రావన్నారు.