TELANGANA

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

ప్రతీ పథకానికి రేషన్‌కార్డే ప్రాతిపదిక..

ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్‌ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్‌ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 6,47,297 కొత్త రేషన్‌ కార్డులు జారీచేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2.82 కోట్ల మందికిపైగా రేషన్‌ లబ్ధిదారులు ఉన్నారు.

 

డిసెంబర్‌ 28 నుంచి దరఖాస్తులు..

డిసెంబర్‌ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందిస్తున్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియను గ్రామాల్లో గ్రామసభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా చేపట్టాలని భావిస్తున్నట్టు పౌర సరఫరాలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించనున్నారు. ధ్రువీకరణ పత్రాలతో మీ–సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

 

సవరణలకు ఛాన్స్‌..

కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో సవరణలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సవరణలకు సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చేందుకు 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి