TELANGANA

“గృహలక్ష్మి” నిబంధనలు ఖరారు – అమలయ్యేది వీరికే..!!

తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీల అమలు పై వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తోంది. మరో రెండు అమలు కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఆరు గ్యారెంటీల్లోని రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఒక్కో కుటుంబానికి రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను 27న ప్రారంభిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో గృహలక్ష్మి అమలు నిబంధనలు ఖరారయ్యాయి.

 

మరో రెండు గ్యారంటీల అమలు: తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారంటీల్లో గృహలక్ష్మి పథకం కీలకమైనది. ఈ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్‌కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది.

 

దీని ఆధారంగా లబ్ధిదారు లను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది.

 

గృహలక్ష్మి విధి విధానాలు: ఇదే సమయంలో గత మూడేళ్ల కాలంలో లబ్దిదారులు వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తించనుంది. కాగా రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.300లకు పైగా సబ్సిడీ అందిస్తోంది.

 

ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఇక, పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం(రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌) కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో రీయింబర్స్‌ చేయనుంది.

 

డీబీటీ ద్వారా చెల్లింపు: ఈ నిర్ణయం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లకు అందజేస్తే, సిలిండర్‌ రీఫిల్‌ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత.. ఆయిల్‌ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్‌ ప్రకారం రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి. కర్ణాటకలో అమలు చేస్తున్న విధానం పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం.

 

దీని ద్వారా ఆయిల్ కంపెనీలకు సిలిండర్ ఇచ్చే సమయంలోనూ ఇప్పుడున్న విధంగానే నగదు అందుతుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన లబ్దిదారులకు రీయంబర్స్ మెంట్ చేసే విధంగా నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు. దీని పైన అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.