TELANGANA

మల్కాజిగిరి, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి(BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది.

 

సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీ ముఖ్యనేతలు, క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి, అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ బుధవారం నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

 

చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, నిజామాబాద్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌, వరంగల్‌ నుంచి డాక్టర్‌ కడియం కావ్య (మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె) పేర్లను కేసీఆర్‌ ప్రకటించారు.

 

అంతకుముందు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు , మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ స్థానాలను ప్రకటించారు. కాగా, మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

 

కాగా ఇటీవల జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేయడంతో ఆ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ను పోటీలో దించారు. మల్కాజిగిరి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి ఒకరు పోటీ చేయాలని మొదట ఆసక్తి చూపినా.. తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.