TELANGANA

తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన..

తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందించారు.

 

నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలని అన్నారు. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలన్నారు.ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని జస్టిస్ చంద్రచూడ్ ఆకాంక్షించారు.

 

బ్రిటీష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతోపాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలని సూచించారు. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని సీజేఐ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నూతన హైకోర్టు నిర్మాణానికి రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి 100 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నేతలు ఎవరు కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు.