TELANGANA

జైల్లో చిప్పకూడే.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో వాల్మీకి, బోయలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. గద్వాల్, ఆలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తనకు తెలుసన్నారు. ఇప్పుడు అందరూ ఒకవైపు రండి.. మన ప్రభుత్వం ఉందన్నారు.

 

ఢిల్లీలో కూడా మన పరిపాలనను అభినందిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఎవరు ఏ సమస్య వచ్చినా.. వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు. ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని బీజేపీ, బీఆర్ఎస్ ఏకమయ్యాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం చేశారని ప్రశ్నించారు.

 

పాలమూరు ప్రాజెక్టుకు డీకే అరుణ జాతీయ హోదా తీసుకురావచ్చు కదా అని అన్నారు. కానీ, పార్టీలో మాత్రం జాతీయ పదవి తెచ్చుకున్నారని డీకే అరుణపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎంపీ ఎన్నికల తర్వాత సంపత్‌కు కాంగ్రెస్‌లో మంచి పదవి వస్తుందన్నారు. వాల్మీకి, బోయలను ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని సీఎం రేవంత్ చెప్పారు. ఓటు విలువ తెలుసు.. అందుకే ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని ఆరోపించారు. ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫోన్లు వినేందుకు వీళ్లకేం పని.. ఎవరైనా బరితెగించి ఇలా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. ట్యాపింగ్ చేసినవారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని సీఎం రేవంత్ హెచ్చరించారు.

 

కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్ పై విచారణ జరుగుతోంది. తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆరోజే చెప్పా.. వినలేదు. ఇవాళ జైలుకు వెళ్తే.. అటువైపు చూడటం లేదు. గత ప్రభుత్వం ఓట్లేసిన ప్రజలపైనే కేసులు పెట్టింది అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.