TELANGANA

అడిషనల్ ఎస్పీలు సస్పెన్షన్.. తర్వాత ఎవరు..!

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రాజకీయ నాయకులవే కాకుండా వ్యాపారులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు కూడా జరిగాయి. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.

 

వీరిద్దరు 48 గంటలు పోలీసుల అదుపులో ఉండడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భుజంగరావుకు పోలీస్ కస్టడీలో ఉన్నారు. శనివారం కూడా భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు విచారించారు. శుక్రవారం అరెస్టయిన మాజీ డీసీపీ రాధా కిషన్ రావును కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

 

రాధా కిషన్ రావును విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రాధా కిషన్ రావు విచారణ తర్వాతా మరో ఇద్దరి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో భుజంగరావు, తిరుపతన్న నడిపిన వ్యవహారంపై పోలీసులు ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 

రాధా కిషన్ రావు టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న గత శాసనసభ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ఎస్‌ఐబీ బృందాన్ని రంగంలోకి దింపినట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ తలనొప్పిగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవిత మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లారు.

 

దీంతో బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారుతోంది. అందుకే నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సీనియర్ నేత కేశవరావు, కడియం శ్రీహరి పార్టీ వీడడం భారీ ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.