TELANGANA

రైతుబంధు, రుణమాఫీ అమలు – రేవంత్ సర్కార్ తాజా ప్రకటన..!!

తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవటమే లక్ష్యంగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. గ్యారంటీల అమలు నిర్ణయాలు వేగంగా తీసుకున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతు రుణమాఫీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ విషయం పైన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టత ఇచ్చారు. అమలు పైన క్లారిటీ ఇచ్చారు.

 

రుణమాఫీ పై నిర్ణయం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ పై అమలు ఇచ్చింది. రుణ మాఫీ అమలు పైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఈ సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు. గతంలోనే సీఎం రేవంత్ దీని పైన క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సేకరణ చేసి రైతులకు ముందుగా రుణమాఫీ అమలు చేసి..ఆ తరువాత కార్పోరేషన్ ద్వారా బ్యాంకుకు తిరిగి చెల్లింపు చేస్తామని వివరించారు.

 

విధి విధానాలపై కసరత్తు ఇప్పుడు ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో…ఎన్నికల తరువాత ఈ గైడ్ లైన్స్ ను అధికారికంగా ప్రకటన చేస్తామని స్పష్టం చేసారు.2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68శాతం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయన్నారు. అయితే.. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా రైతుబంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో వేయలేదని మంత్రి వివరించారు. 2018-19 వానాకాలంలో 4 నెలల 5 రోజుల్లో వేస్తే.. అదే ఏడాది యాసంగిలో 5 నెలల 11 రోజులు పట్టిందని చెప్పుకొచ్చారు.

 

కాంగ్రెస్ కు కలిసొచ్చేనా ఇక..ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. పెండింగ్ స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి ప్రచారం ప్రారంభించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా రైతుబంధు, రైత రుణమాఫీ పైన క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత గ్యారంటీలను అమలు చేస్తూనే…రాజకీయంగా బీఆర్ఎస్ ను రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవటం ఇప్పుడు రేవంత్ కు వ్యక్తిగత ప్రతిష్ఠాత్మక అంశంగా మారింది. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల రాజకీయంగా మరింతగా ఆసక్తిని పెంచుతోంది.