TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీ..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ వేగవంతంగా నడుస్తోంది. ఈకేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు(Radhakishan rao) కస్టడీ కోరుతూ.. పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టు విచారించింది. రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 7 రోజుల పాటు రాధాకిషన్‌రావును పోలీసులు ప్రశ్నించనున్నారు.

 

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును నిందితులుగా చేర్చిన విషయం తెల్సిందే. కాగా, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావును నియమించారని, అదే సామాజికవర్గానికి చెందిన అధికారులును ఏరి కోరి మరీ ప్రభాకర్ రావు తన టీంలో నియమించుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు.

 

ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు, వ్యాపారస్తులతో పాటు బీఆర్‌ఎస్‌ విమర్శకులు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రాధాకిషన్‌రావు(Radhakishan rao) రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నల్గొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, హైదరాబాద్ సిటి నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్‌రావును ఎస్‌ఐబీకి బదిలీ చేయించుకున్నారు.

 

కీలకమైన టాస్క్‌ఫోర్స్ డీసీపీ పోస్టులో బీఆర్‌ఎస్‌ సుప్రీమో అదేశాలతో 2017లో రాధాకిషన్‌రావును నియమించారు. శాఖాపరమైన వ్యవహారాలతో పాటు రాజకీయ పరంగా నిఘా పెట్టేందుకు అతనికి ఆదేశాలు జారీ చేశారు. వీరు నలుగురూ తరుచూ కలుస్తూ బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రాధాకిషన్‌రావు తెలిపారు. అంతేగాక, వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న గట్టుమల్లును, ప్రభాకరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐబీకి బదిలీ చేశారు. వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వారని వెల్లడించారు.

 

ముందు జాగ్రత్త చర్యగా సోషల్‌మీడియా యాప్స్ అయిన వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌లలో మాత్రమే తరచూ సంప్రతింపులు జరుపుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాధాకిషన్‌రావు తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వీస్‌ 2020 ఆగష్టులో ముగిసినా.. మరో మూడేళ్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగానే కొనసాగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

 

మరోవైపు ప్రభాకర్‌రావు ప్రోద్బలంతోనే ఎస్ఐబీలోకి వచ్చిన ప్రణీత్‌రావు((Praneeth rao)).. అతని అడుగుజాడల్లోనే నడిచాడని, ప్రభాకర్‌రావు ఐజీ అయిన తర్వాత ఎస్‌ఐబీలో ప్రత్యేక ఎస్‌ఓటి బృందాన్ని ఏర్పాటు చేశారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. వీరి ప్రధాన లక్ష్యం ప్రతిపక్ష నాయకులతో పాటు బీఆర్‌ఎస్‌ రెబల్స్‌ పై నిఘా పెట్టడమని తేల్చారు. జనంలో పేరున్న నాయకులు, క్యాడర్ ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు