TELANGANA

ఎన్నికల వేళ కేసీఆర్ బిగ్ స్కెచ్ – టార్గెట్ రేవంత్…!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని గులాబీ పార్టీని దెబ్బ తీసేందకు ప్రయత్నిస్తోంది. దీంతో, పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. రైతు సమస్యలపైన రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా రేవంత్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ లో చేరికలు పెరిగాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. అటు బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో తన పార్టీ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం వేళ కేసీఆర్ ఆలర్ట్ అయ్యారు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్దులను ఖరారు చేసారు. కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న అంశాలను రేవంత్ ప్రభుత్వం బయట పెడుతోంది. రాజకీయంగానూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

ఈ సమయంలోనే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే రైతు సమస్యల పైన నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. సీఎం రేవంత్ ను టార్గెట్ చేసారు. ఇక..ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి పర్యటనలకు సిద్దమయ్యారు. కేసీఆర్ త‌న ప‌ర్య‌ట‌న‌ను చేవేళ్ల నుంచే శ్రీ‌కారం చుట్టానున్నారు. ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యమని భావించిన ఆయన చేవెళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు. బస్సు యాత్రల ద్వారా కేసీఆర్ ప్రతి నియోజకవర్గంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చనే నిర్ణయంతోనే ప్రచారానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.

 

దీంతో, కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావన చేస్తానేది కీలకంగా మారుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మెజార్టీ సీట్ల సాధన పైనే గురి పెట్టటంతో ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారం .. సీట్ల గెలుపులో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.