TELANGANA

తెలంగాణలో ప్రాణాంతక జిబిఎస్ వ్యాధి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..

దేశంలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసులు పెరుగుతున్నందున ఆందోళన వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి GBS కేసు నమోదైంది. హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు GBS లక్షణాలు కనిపించడంతో, ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో GBS కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణేలో దాదాపు 130 జిబిఎస్ అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి.

 

పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో పాటు ముగ్గురు మరణించారు. కోల్‌కతా మరియు హుగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మరణాలు సంభవించాయి. కోల్‌కతాలోని బీసీ రాయ్ ఆసుపత్రిలో ఈ నెల 26న దెబ్ కుమార్ సాహూ (10) అనే బాలుడు మృతి చెందాడు. ఆ మరుసటి రోజే నగరంలోని ఎస్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో అరిత్ర మనల్ (17), హుగ్లీ జిల్లాలోని మరో ఆసుపత్రిలో 48 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

 

మహారాష్ట్రలో పుణేలో 130 కేసులు

మహారాష్ట్రలోని పుణేలో GBS అనుమానాస్పద కేసులు అధికంగా నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రంలో ఎవరైనా GBS లక్షణాలతో బాధపడినా వెంటనే ఆస్పత్రులకు వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందితే త్వరగా కోలుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.

 

జిమిఎస్ గురించి ముఖ్యమైన వివరాలు

గులియన్-బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే ఒక రకమైన వ్యాధి. ఇది బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా సంభవిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ఈ వ్యాధి వల్ల నరాలు బలహీనపడి, కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే.. రోగికి శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది. చివరికి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

 

లక్షణాలు:

శరీరం అంతట తిమ్మిరిగా ఉండటం

 

కండరాల బలహీనత

 

డయేరియా, పొత్తికడుపు నొప్పి

 

జ్వరం మరియు వాంతులు

 

కారణాలు:

కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి అంటువ్యాధి కాదు, కానీ సరైన చికిత్స లేకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.

 

చికిత్స ఖర్చు:

GBS సోకిన వ్యక్తికి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్‌ల ద్వారా చికిత్స అందించాలి. ఒక్కో ఇంజెక్షన్ ఖర్చు సుమారు 20,000 రూపాయలు. ఒక రోగికి సుమారు 13 ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది.

 

జాగ్రత్తలు:

 

కలుషిత నీరు మరియు ఆహారం తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

 

GBS లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

 

సరైన చికిత్సతో ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు, కానీ చికిత్స ఆలస్యం అయితే ప్రాణాపాయం ఎదురవుతుంది.

 

గులియన్-బారే సిండ్రోమ్‌ను పక్షవాతంగా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి సోకితే కండరాలు పూర్తిగా బలహీనపడి, రోగి చేతులు, కాళ్ళు కదిపే సామర్థ్యాన్ని కోల్పోతాడు. అయితే, సరైన చికిత్సతో రోగి క్రమంగా కోలుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా కోలుకోవడానికి నెలలు లేదా సంవత్సరం కూడా పట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, కలుషిత నీరు మరియు ఆహారం నుండి దూరంగా ఉండాలి.